భారీ వర్షాల ఎఫెక్ట్: విశాఖ, అల్లూరి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

  • అల్పపీడనం కొనసాగుతోందన్న విశాఖ వాతావరణ కేంద్రం
  • మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడి
  • ఈ నెల 19న తీరాన్ని దాటే అవకాశం ఉందన్న విశాఖ వాతావరణ కేంద్రం
ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. విశాఖ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అత్యవసర ప్రకటన చేస్తూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో 24 గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఈ నెల 19న తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ భారతి సవ్వడి వెల్లడించారు.

ఈ క్రమంలో అధికారులు విశాఖపట్నం, అనకాపల్లి, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 

Visakha District
Visakhapatnam
Andhra Pradesh Rains
Heavy Rains
School Holiday
Collector Dinesh Kumar
Alluri District
Weather Alert
IMD Alert
భారతి సవ్వడి

More Telugu News